తాడిపత్రిలో మితిమీరిన
టీడీపీ నేతల అరాచకం
● కేశవరెడ్డిపై హత్యాయత్నం చేసిన వారందరినీ అరెస్ట్ చేయాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం
అనంతపురం: తాడిపత్రిలో అధికార టీడీపీ నాయకుల అరాచకం మితిమీరిపోయిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నాయకుడు గంగులకుంట కేశవరెడ్డి పోలీస్ స్టేషన్ సమీపంలో టీ తాగుతుండగా జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా.. అక్కడ మరోమారు దాడికి ప్రయత్నించారన్నారు. ఏకంగా ఆస్పత్రిపైనే రాళ్లతో దాడి చేశారని, ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులకు రక్షణ కరువైందని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయన్నారు. విపక్ష పార్టీ నాయకులపై దాడులు, హత్యాయత్నాలు, వారి ఆస్తుల విధ్వంసం రోజువారీ కార్యక్రమాల్లా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఇకనైనా హింసాకాండను నిరోధించకపోతే రాష్ట్రంలో కొత్త దుష్ట సంప్రదాయానికి బీజం వేసిన వారవుతారన్నారు.కేశవరెడ్డిపై హత్యాయత్నం చేసిన వారందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


