● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవ్ ధ్వజం
అనంతపురం: సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, లాకప్డెత్లు పెంచారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంపద సృష్టి సంగతి దేవుడెరుగు ఎమ్మెల్యేల దోపిడీ అధికమైందన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగితే, ఆయన కుమారుడు లోకేష్కు అహంకారం, పవన్ కల్యాణ్కు పిచ్చి పెరిగిందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో సీఎం చంద్రబాబు గంజాయితో పాటు బెల్టుషాపులు పెంచారని మండిపడ్డారు. మెగా డీఎస్సీలో దగా చేసి నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. లాకప్డెత్లో బిడ్డను కోల్పోయిన కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారిందన్నారు. ఆ తల్లిని సీఎం పిలిపించి నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హిందూ సంప్రదాయం ప్రకారం మృతి చెందిన మనిషికి సంబంధించి క్రతువులను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులకు ఎలాగూ సమాచారం ఇవ్వలేదు. కనీసం సీఎం, డిప్యూటీ సీఎం అయినా సంప్రదాయం ప్రకారం గుండు కొట్టించుకోవాలి’ అని పేర్కొన్నారు. పోలీసుల భుజాలపై గన్ పెట్టి చంద్రబాబు తన శత్రువులపై గురి పెడుతున్నారని, ఈ క్రమంలో పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని మాధవ్ సూచించారు.


