అనంతపురం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన స్థాయి మరిచి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి.రమేష్ గౌడ్ విమర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి పవన్ ఎక్కడ తిరుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. మూడు రోజుల క్రితం సినిమా షూటింగ్కు వచ్చినట్లు కాకినాడకు వచ్చారన్నారు. ‘తాటతీస్తాం.. తోలుతీస్తాం.. అరచేతుల్లో రేఖలు లేకుండా చేస్తాం.. వైసీపీ గూండాల్లారా.. రౌడీల్లారా..’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. తాటాకు చప్పళ్లకు వైఎస్సార్సీపీ నేతలు ఎవ్వరూ భయపడబోరని హెచ్చరించారు.


