అనంతపురం కల్చరల్: ఒక్క రోజుకు పరిమితం కాకుండా నిత్య జీవితంలో యోగా అంతర్భాగం కావాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు యోగాసనాలు వేశారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ఒత్తిడి లేని జీవితానికి యోగా చక్కటి పరిష్కార మార్గమన్నారు. ఈ ఏడాది 4 వేల ప్రదేశాల్లో 5 లక్షల మందికి పైగా యోగాపై శిక్షణ, అవగాహన కల్పించామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీల్లో పాల్గొన్న 50 మందికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలనందించి సత్కరించారు. కార్యక్రమంలో వివేకానంద యోగ కేంద్ర అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, బ్రహ్మకుమారీల ఇన్చార్జ్ సిస్టర్ శారద, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి లాట్యనాయక్, ఇన్చార్జ్ ఆర్డీఓ రామమోహన్, ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, కమిషనర్ జశ్వంత్రావు, డీఎంహెచ్వో డాక్టర్ ఈబీదేవి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆనంద్


