అనంతపురం టౌన్: ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం పారిశ్రామికవేత్తలు రెండేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. రాయితీల మంజూరులో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 2023–27 పారిశ్రామిక పాలసీలో జిల్లా వ్యాప్తంగా 1,200 మందికి పైగా చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లు ఏర్పాటు చేశారు. దాదాపు రూ.600 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. వీటిద్వారా ప్రత్యక్షంగా 4 వేల మందికి, పరోక్షంగా 2వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంత పెద్ద ఎత్తున యూనిట్లు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పారిశ్రామిక వేత్తలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా రాయితీలు మంజూరు చేయకపోవడంతో పారిశ్రామిక వేత్తలు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,200 చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు మాత్రమే దాదాపు రూ.75 కోట్ల మేర రాయితీలను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. పెద్ద తరహా పరిశ్రమలు జిల్లాలో 17కు పైగా ఉన్నాయి. వీటికి సైతం ప్రోత్సాహకాలు సకాలంలో అందడం లేదు. ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి యూనిట్లు నెలకొల్పిన పారిశ్రామికవేత్తలకు రాయితీలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి
పరిశ్రమలు నెలకొల్పిన పారిశ్రామికవేత్తలకు రాయితీలు అందని మాట వాస్తవమే. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా వ్యాప్తంగా రూ.75కోట్లకు పైగా రాయితీలు రావాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు 20 శాతం మేర రాయితీలు అందించారు. పరిశ్రమ వివరాలు, యూనిట్ కాస్ట్, ఉపాధి కల్పన తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాం. రాయితీల మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
– నాగరాజ, ఇన్చార్జ్ జీఎం,
పరిశ్రమల శాఖ
పరిశ్రమలకు రూ.75 కోట్ల మేర బకాయిలు
రాయితీలు విడుదలలో ప్రభుత్వం మీన మేషాలు
రెండేళ్లుగా ఎదురు చూస్తున్న పారిశ్రామికవేత్తలు


