ఇదేం పద్ధతి మాస్టార్లూ.. | - | Sakshi
Sakshi News home page

ఇదేం పద్ధతి మాస్టార్లూ..

Jun 19 2025 4:12 AM | Updated on Jun 19 2025 4:12 AM

ఇదేం పద్ధతి మాస్టార్లూ..

ఇదేం పద్ధతి మాస్టార్లూ..

కార్పొరేషన్‌ స్కూళ్ల టీచర్ల లీలలు

అనుకూలమైన పాఠశాలల కోసం అడ్డదారులు తొక్కడంపై విమర్శలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: కార్పొరేషన్‌ పాఠశాలల్లో పని చేస్తున్న కొందరు ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన స్కూళ్ల కోసం అడ్డదారులు తొక్కారు. కక్కుర్తి పడి అడ్డగోలుగా పాయింట్లు వేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వెబ్‌ కౌన్సెలింగ్‌లో తమను ఎవరూ పట్టించుకోరనే ధీమాతో ఇలా అడ్డగోలు పాయింట్లు పెట్టుకున్నారు. శారదా నగర పాలక బాలికల పాఠశాలలో హిందీ టీచర్‌గా పని చేస్తున్న చంద్రకళ భర్త ఎంటీఎస్‌ టీచరు. ఎంటీఎస్‌ టీచర్లకు స్పౌజ్‌ వర్తించదు. అయినా చంద్రకళ స్పౌజ్‌ పాయింట్లతో నేతాజీ స్కూల్‌కు వెళ్లారు. జ్యోతి అనే ఇంగ్లిష్‌ టీచరు సుమారు ఐదేళ్ల క్రితం స్పౌజ్‌ పాయింట్లతోనే శారదా స్కూల్‌కు వచ్చారు. ప్రస్తుతం రిక్వెస్ట్‌ బదిలీకి కూడా స్పౌజ్‌ పాయింట్లు వేసుకుని ఆర్‌ఎంహెచ్‌ఎస్‌ స్కూల్‌కు వెళ్లారు. అలాగే మరో తెలుగు టీచర్‌ పుల్లమ్మ స్పౌజ్‌ పాయింట్లతో ఎస్కేడీ పాఠశాలకు వెళ్లారు.

ఎవరి కోసం రిలీవ్‌ చేయొద్దన్నారో..

పాతూరు కస్తూర్బా బాలికల పాఠశాలలో సోషల్‌ టీచర్‌గా పని చేస్తున్న మనోరంజని 8 ఏళ్లు పూర్తయినా.. ఏడాదిలో రిటైర్డ్‌ కాబోతున్నారు. ఈమె విల్లింగ్‌ ఉంటే తప్ప బయటకు పంపరు. ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎస్కేడీ పాఠశాల అలాట్‌ కావడంతో ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ ఆమెకు నచ్చిన స్కూల్‌ రాలేదంటూ ఇప్పటికీ రిలీవ్‌ కాలేదు. డీఈఓ కార్యాలయం నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతో అక్కడే కొనసాగుతున్నారు. కాగా కస్తూర్బా స్కూల్‌ నుంచి ఎస్కేడీ స్కూల్‌ లాగిన్‌కు మనోరంజని పేరు మార్పు జరిగింది. అయినా నేటికీ డిప్యూటేషన్‌పై వస్తున్నట్లు అటెండెన్స్‌ వేస్తున్నారు. మరోవైపు ఎస్కేడీ పాఠశాలలో సోషల్‌లో మూడు పోస్టులుంటే ఈమె వెళ్లకపోవడంతో ఇద్దరే పని చేస్తున్నారు.

అధికారుల ఇష్టారాజ్యం..

బాలికల పాఠశాలల్లో 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులు ఉండకూడదంటూ ప్రభుత్వం ఇటీవల జీఓ విడుదల చేసింది. అలా పని చేస్తున్న స్థానాలను ఖాళీలుగా చూపించారు. అయితే నగరంలోని శారదా బాలికల పాఠశాలకు ఇద్దరు 50 ఏళ్లలోపు సోషల్‌ పురుష టీచర్లను కేటాయించడం గమనార్హం. వాస్తవానికి నగర పాలక పాఠశాలల్లో మహిళా టీచర్లు ఉన్నారు. వారందరికీ యూపీ పాఠశాలలు, బాలుర ఉన్నత పాఠశాలలు కేటాయించారు. శ్రీపొట్టి శ్రీరాములు పాఠశాలలో పని చేస్తున్న ఇందతుల్లా, జయకృష్ణ తప్పనిసరి బదిలీ కావాల్సి ఉంది. బాలుర పాఠశాలల్లో ఖాళీలు లేకపోవడంతో మొన్నటిదాకా వారు అక్కడే కొనసాగుతూ వచ్చారు. జీతాలకు ఇబ్బంది తలెత్తే ప్రమాదం నెలకొనడంతో రెండు రోజుల కిందట తప్పనిసరి పరిస్థితుల్లో బాలికల పాఠశాలకు కేటాయించారు. అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగానే ఈ దుస్థితి నెలకొందని పలువురు టీచర్లు, సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement