
దళితులకు రక్షణ కల్పించలేరా?
అనంతపురం అర్బన్: దళిత, గిరిజన మహిళలు, మైనర్ బాలికలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విద్యార్థి, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు ధ్వజమెత్తారు. అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయరా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థి, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు అనంతపురం సంగమేష్ సర్కిల్ నుంచి ప్రదర్శనగా వచ్చి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కార్యాలయ ద్వారం వద్ద అడ్డుగా ఉంచిన స్టాపర్లను తోసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో దళిత, గిరిజన మహిళలు, మైనర్ బాలికలపై అకృత్యాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అమానవీయ ఘటన,నగరంలోని రామ కృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య ఘటన ప్రభుత్వ వైఫలానికి నిదర్శనమన్నారు. బాధిత కుటుంబాలను కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శించకపోవడం చూస్తే దళితులు, మహిళల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి స్పష్టమవుతోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నెల రోజుల్లో కేసు విచారణ పూర్తి చేసి దుండగులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం జేసీ శివ్ నారాయణ్ శర్మకు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాము, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి సురేష్, రాయలసీమ విద్యావంతుల వేదిక వెంకటేష్, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ సాకే హరి, సామాజిక న్యాయ వేదిక కుళ్లాయప్ప, సీఎల్సీ ఆదినారాయణ, ఐఎఫ్టీయూ ఏసురత్నం, దావీదు, నిరుద్యోగ ఐక్యవేదిక రామన్న, పీపీఎస్ వీరనారప్ప, ప్రజాకళామండలి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన విద్యార్థి, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు
ఉద్రిక్తతకు దారి తీసిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం