
కూటమి నేతల బాహాబాహీ
సాక్షి టాస్క్ఫోర్స్: చెన్నేకొత్తపల్లిలోని ఓ ధాబాలో కూటమి నేతలు బాహాబాహీకి దిగారు. ఓ వర్గం నాయకుడు కత్తితో దాడి చేయగా...మరోవర్గం వారు రాళ్లదాడితో రణరంగం సృష్టించారు. ఈ ఘటన బుధవారం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఎన్ఎస్గేట్కు చెందిన ఖాసీంవలి, నాగరాజు పరిటాల శ్రీరామ్ అనుచరులు. వీరిద్దరూ బుధవారం సీకే పల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ ధాబాలో కూర్చుని ఉన్నారు. అదే సమయంలో ధర్మవరం మండలం చిగిచెర్లకు చెందిన అరవింద్రెడ్డితో పాటు మరికొందరు టీ తాగేందుకు అదే ధాబాకు వచ్చారు.అరవింద్రెడ్డి గతంలో వరదాపురం సూరి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్ అనుచరులు ఖాసీంవలి, నాగరాజు ధర్మవరం రాజకీయాలపై మాట్లాడుకుంటుండగా... అరవింద్రెడ్డి కలుగజేసుకున్నాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి... ఒకరిపై మరొకరు దాడికి దిగారు.దీంతో అరవింద్రెడ్డి వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకుని వచ్చి ఖాసీంవలి, నాగరాజుపై దాడి చేశాడు. వారిద్దరూ రాళ్లతో అరవిందరెడ్డిపై ప్రతిదాడి చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాల వారు గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని చెన్నేకొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అరవింద్రెడ్డి ఫిర్యాదు అందిన వెంటనే ఇరువర్గాలపై కేసు నమోదు చేస్తామని చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
సీకేపల్లి ధాబాలో ఇరు వర్గాల ఘర్షణ
‘పరిటాల’ అనుచరులపై కత్తితో దాడి చేసిన సూరి అనుచరుడు
ప్రతిదాడిగా రాళ్లతో రణరంగం సృష్టించిన పరిటాల వర్గం