
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతాం
రాప్తాడు: ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం చూపే బాధ్యత తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీలోని చిన్మయనగర్ ఆర్జేసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ‘జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం అర్జీదారులతో కిటకిటలాడింది. కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే పరిటాల సునీత, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జునుడు, రామ్మోహన్, డీఆర్వో మలోల ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 407 వినతులు అందాయి. ఎక్కువ భాగం భూ సమస్యలపైనే ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అర్జీల్లో 70 నుంచి 80 శాతం పరిష్కారం చూపుతున్నారని, వంద శాతం పరిష్కరించేలా కృషి చేయాలని ఆదేశించారు.
వినతుల్లో కొన్ని...
● రాప్తాడు సమీపంలో రైల్వే వంతెన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, పనులు ప్రారంభించి ఏడేళ్లవుతున్నా నేటికీ పూర్తి కాలేదని సర్పంచు సాకే తిరుపాల్ విన్నవించాడు. పండమేరు వంక (జేఎన్టీయూ) రహదారిలో బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని కోరాడు. వంక సమీపంలో ప్రభుత్వ స్థలం 25 ఎకరాల్లో పార్క్ మంజూరు చేయాలని, రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్కు కాంపౌడ్ వాల్ ఏర్పాటు చేయాలన్నాడు. పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించాడు.
● రాప్తాడు మండలంలోని మరూరు రెవెన్యూ గ్రామంలో భూమి రిజిస్ట్రేషన్కు సబ్ రిజిస్ట్రార్ ఎకరాకు రూ.1.50 లక్షలు అడుగుతున్నారని మరూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి, కొండారెడ్డి, వీర నారప్ప, ఆదినారాయణ, నరసింహులు తదితరులు ఫిర్యాదు చేశారు.
● అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ బీఎన్ఆర్ కాలనీలో 1996లో 3 సెంట్ల చొప్పున స్థలం పంపిణీ చేశారని, ఈ క్రమంలో తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని పలువురు కాలనీ వాసులు కోరారు.
చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు పరదేశి లక్ష్మీదేవి. బుక్కరాయసముద్రం మండలం గాంధీనగర్వాసి. కుమారుడు గురుమూర్తి, కుమార్తె లక్ష్మీదేవిని వృద్ధురాలు ఎంతో గారాబంగా పెంచింది. ఇద్దరికీ వివాహాలు కూడా చేసింది. కుమారుడు గురుమూర్తి మృతి చెందాడు. కుమార్తె లక్ష్మీదేవి కొన్నేళ్ల క్రితం భర్తతో గొడవపడి బనగానపల్లి నుంచి వచ్చేసి తల్లి దగ్గర ఉండేది. తల్లిని నమ్మించి రూ.3 లక్షలు నగదు, 3 తులాల బంగారు నగలు, 2 సెంట్ల స్థలం, 1–25 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకున్న లక్ష్మీదేవి... ఆ తర్వాత ఇంటి నుంచి ఆమెను బయటకు గెంటేసింది. ‘దిక్కున్న చోట చెప్పుకో ఇచ్చేదే లేదు’ అంటూ దాడి చేసింది. దీంతో దిక్కు తెలియని వృద్ధురాలు రాప్తాడులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తనకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించింది.
కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
రాప్తాడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
వివిధ సమస్యలపై 407 వినతులు

ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతాం