అనంతపురం అర్బన్: ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం రాప్తాడు మండలంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసన్నాయపల్లి వద్ద ఉన్న ఆర్జేసీ కల్యాణ మండపంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు తమ వివరాలతో పాటు సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలన్నారు. సమస్యపై గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి స్లిప్, పాత రసీదు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్కు సమాచారం వస్తుందని, కాబట్టి అర్జీదారులు తమ ఫోన్లోని మెసేజ్లను చూసుకోవాలన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ను వాట్సాప్లో పంపిస్తామన్నారు. అర్జీ సమర్పించేప్పుడు కచ్చితమైన వివరాలను ఇవ్వాలని సూచించారు. రాప్తాడు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిందాల్ కార్మికుడి అనుమానాస్పద మృతి
బొమ్మనహాళ్: మండలంలోని హరేసముద్రం గ్రామ శివారులో ఉన్న జిందాల్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ నబీరసూల్ తెలిపిన మేరకు.. జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లా ఖర్మహీ గ్రామానికి చెందిన అభిషేక్ భూయాన్ (36), తమ్ముడు గణేష్ భూయాన్తో కలిసి కొన్నేళ్ల క్రితం వలస వచ్చాడు. జిందాల్ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. ఇటీవల అభిషేక్ భూయాన్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 14న జీతం తీసుకున్నప్పటి నుంచి ఇంకా ఎక్కువగా మద్యం తాగేవాడు.
ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం కనపడకుండా పోయిన ఇతను.. ఆదివారం ఫ్యాక్టరీ సమీపంలోనే విగతజీవిగా పడి కనిపించాడు. ఫ్యాక్టరీ కార్మికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గణేష్ భూయాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్కు తరలించారు. మద్యం ఎక్కువగా తాగి నీటి దాహానికి మృతి చెందాడా.. లేక ఎవరైనా హతమార్చారా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
భక్తులపై తేనెటీగల దాడి.. 20 మందికి గాయాలు
ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులపై ఆదివారం తేనెటీగలు దాడి చేశాయి. వివరాలు.. మండల పరిధిలోని వెలిగొండ గ్రామానికి చెందిన రాజశేఖర్, భాగ్యమ్మ, శ్రీలేఖ, రామాంజినేయులు, జయలక్ష్మి, రాజేశ్వరి, యుగంధర్, మల్లికార్జున, ప్రతాప్, ప్రభాస్, జనార్దన్ తదితర 20 మంది ఆదివారం పెన్నహోబిలం వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పొట్టేలు బలి ఇచ్చి ఆలయం కింది భాగంలో వంట చేసుకుని విందు భోజనాలకు కూర్చున్నారు. ఈ క్రమంలోనే అక్కడే చెట్టు మీద ఉన్న పెద్ద తేనెతుట్టె నుంచి ఒక్కసారిగా తేనెటీగలు లేచి దాడి చేశాయి. హఠాత్పరిణామంతో ఆందోళనకు గురైన వారు కేకలు వేస్తూ పిల్లాపాపలతో కలిసి పరుగు తీశారు. స్థానికులు 108 సాయంతో గాయపడ్డ వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రాప్తాడులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’