యలమంచిలి రూరల్: స్థానిక అడిషనల్ జడ్జి (జూనియర్ డివిజన్) కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు నూతన భవనాన్ని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ రవి చీమలపాటి ప్రారంభించారు. ఇక్కడ ఉన్న పాత న్యాయస్థానాల భవనాలు శిథిలం కావడంతో నిర్మించిన కొత్త భవనానికి వారు ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా కోర్టు న్యాయమూర్తి చిన్నమశెట్టి రాజు, యలమంచిలి కోర్టుల న్యాయమూర్తులు, మున్సిపల్ కమిషనర్ బి.జె.ఎస్. ప్రసాదరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వి. రమణ, కార్యదర్శి ముత్తుర్తి శ్రీనివాసరావు, సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


