● లైనుకొత్తూరు వద్ద అదుపుతప్పి
బోల్తా పడిన లారీ
● త్రుటిలో తప్పిన ప్రమాదం
యలమంచిలి రూరల్: బండరాళ్ల లారీలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఈ లారీలు కూటమి పా ర్టీల ప్రజాప్రతినిధులవి కావడంతో స్థానిక పోలీసు,రవాణాశాఖ అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.ఆదివారం ఓవర్ లోడ్తో వెళ్తున్న ఓ బండరాళ్ల లారీ లైనుకొత్తూరు సమీపంలో బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడ ఇతర వాహనాలు,జనం ఎవరూ లేకపోవడంతో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. నక్కపల్లి నుంచి రాంబిల్లి ఎన్ఏవోబీకి బండరాళ్లను తీసుకెళ్తున్న లారీ యలమంచిలి మండలం లైనుకొత్తూరు సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.లారీ వెనుక ఉన్న బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి.ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో సమీపంలో ఉన్న జనం భయాందోళనకు గురయ్యారు.ప్రమాద సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడకు చేరుకుని వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా బంగరాళ్లను లోడు చేసి రవాణా చేయడం,కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేల టన్నుల బరువు ఉన్న బండరాళ్లు జారి పడినప్పుడు గానీ,వాటిని రవాణా చేస్తున్న లారీలు ప్రమాదాలకు గురైనప్పుడు గానీ భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


