అనకాపల్లి ఎన్టీఆర్ కాలనీలో చిన్నారికి
పోలియో చుక్కలు వేస్తున్న వైద్య సిబ్బంది
అనకాపల్లి: జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. ఐదేళ్లలోపు వయసున్న 1,63,803 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు చిన్నారులు 1,67,576 మందికి ఉండగా 97.75శాతం మందికి చుక్కలు వేశారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు పీహెచ్సీలో హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో కలెక్టర్ విజయ కృష్ణన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈనెల 29,30న వైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి, మిగిలిపోయిన చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలియో చుక్కలు వేసినట్టు డీఎంహెచ్వో ఎం.హైమావతి తెలిపారు. స్థానిక చిన్నరాజుపేట అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఆమె పోలియో చుక్కలను వేశారు. అంతకుముందు అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీలో చిన్నారులకు తుమ్మపాల సీహెచ్సీ వైద్యసిబ్బంది పోలియోచుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


