ఎస్.రాయవరం: మేజర్ గ్రామ పంచాయతీ తిమ్మాపురం శివారు కోనవానిపాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులను గుడిప్రాంగణంలో కూర్చోబెట్టి పాఠాలు బోధించడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ మండిపడ్డారు. శనివారం ఎస్ఎఫ్ఐ, సీపీఎం నాయకులు ఆ పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాడు–నేడు పథకంలో ఈ పాఠశాలకు నిధులు విడుదలయ్యాయని, అవసరమైన సామగ్రి సమకూర్చినా ఉపాధ్యాయులు, కాంట్రాక్టరు ఎందుకు పనులు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఏళ్లతరబడి రామాలయం వరండాలో తరగతులు నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హోం మంత్రి క్యాంపు కార్యాలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలలో ఇటువంటి పరిస్థితి ఉంటే ప్రజాప్రతినిధులు ఎందుకుపట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా జిల్లాఉన్నతాధికారులు స్పందించి పాఠశాల భవననిర్మాణాలు పూర్తి చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.ఆదివారం నియోజకవర్గ పర్యటనకు వస్తున్న హోం మంత్రి అనిత స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ నాయకుడు నానాజీ, విద్యార్థులు తల్లిదండ్రులు,ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.


