నర్సీపట్నం: చంద్రబాబు, నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలోని పెనుమాక, ఉండవల్లి ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలసుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఆ ప్రాంత వైఎస్సార్సీపీ సమన్వయకర్తలపై టీడీపీ గుండాలు దాడి చేయడం దారుణమన్నారు. మాజీ మంత్రులు పేర్నినాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కాన్వాయ్పై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. నారా లోకేష్ ప్రోద్బలంతో పోలీసుల సమక్షంలో టీడీపీ గుండాలు ఆరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నాయకుడు అప్పిరెడ్డి తప్పించుకోవడంతో టీడీపీ గుండాలు విసిరిన బండరాయి కానిస్టేబుల్కు తగలడంతో తీవ్రంగా గాయపడినట్టు చెప్పారు. రాజధాని పేరుతో జరుగుతున్న అక్రమాలపై ఆ ప్రాంత రైతులు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలిశారని, అవసరం అనుకుంటే న్యాయపోరాటం ద్వారా అండగా నిలుస్తానని జగన్మోహన్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, సమన్వయకర్తలతో పార్టీ అధ్యక్షులు సమన్వయ కమిటీ వేశారన్నారు. రాజధాని పేరుతో అమరావతిలో కూటమి పాల్పడుతున్న ఆరాచకాలు బయట పడతాయనే దురుద్దేశంతో రైతుల ముసుగులో టీడీపీ గుండాలతో దాడులు చేశారన్నారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా చంద్రబాబు, లోకేష్ ఆరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం దురాగతాలను ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మాకవరపాలెం మండల అధ్యక్షుడు చిటికెల వెంకటరమణ, రాజుబాబు పాల్గొన్నారు.


