మాట్లాడుతున్న ప్రేమ చంద్రశేఖర్
అనకాపల్లి: విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న మూడు కరువు భత్యం బకాయిలు చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసి సంస్థలో విలీనం చేయాలని, తెలంగాణ తరహాలో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.48వేలు చెల్లించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాడేందుకు కార్యక్రమాలు రూపకల్పన చేసినట్టు చెప్పారు. దీనిలో భాగంగానే ఎస్ఈ, ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నామని, వచ్చేనెల 15న ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన, ఆగస్టులో చలో విద్యుత్ సౌధా నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులందరూ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేపాడ సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు, నర్సీపట్నం డివిజన్ అధ్యక్షుడు వి.రమేష్, జిల్లా నాయకులు గోపి, శేషు, రాజేష్, ఎస్.ఎం.జానీ, రాజేశ్వరరావు, అశోక్ కుమార్, ఎల్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


