ఎన్సీసీ విభాగంలో లోకజ్ఞ ప్రతిభ
అచ్యుతాపురం రూరల్ : ఎన్సీసీ విభాగంలో శ్రీ భవానీ విద్యానికేతన్ విద్యా ర్థిని లోకజ్ఞకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం గర్వకారణమని వ్యవస్థాపకుడు కూండ్రపు మూర్తి శనివారం విద్యార్థిని లోకజ్ఞను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 25న విశాఖపట్నం ఎన్సీసీ గ్రూప్ హెడ్క్వార్టర్స్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డీడీజీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుందన్నారు. ఎన్సీసీ కార్యకలాపాల్లో క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం, చురుకై న భాగస్వామ్యాన్ని ప్రదర్శించిన క్యాడెట్లలో ఆరుగురు బాలికలను డీడీజీ ప్రశంసాపత్రానికి ఎంపిక చేయగా వారిలో శ్రీ భవానీ విద్యానికేతన్ విద్యార్థిని లోకజ్ఞ చోటు దక్కించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ గ్రూప్ కమాండర్, వివిధ ఎన్సీసీ యూనిట్ల కమాండింగ్ అధికారులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎస్.రాయవరం: ధర్మవరం అగ్రహారంలో ఓ ఇంటిలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తులం బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు ఆపహరణకు గురైనట్టు ఎస్ఐ రమేష్ శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన కలిగట్ల నాగ సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా శుక్రవారం రాత్రి గోకులపాడులో బంధువుల పెళ్లికి వెళ్లారని, ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు ఇంట్లో ప్రవేశించి బీరువా తలుపులు తెరచి బంగారు చెవి దిద్దులు, వెండి వస్తువులు చోరీ చేసినట్టు ఎస్ఐ చెప్పారు. అందిన ఫిర్యాదు మేరకు అడ్డురోడ్డు సీఐ ఎల్.రామకృష్ణ ఆధ్వర్యంలో కేసునమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.


