నక్కపల్లి: ఇటీవల బోయపాడు సముద్ర తీరంలో లక్షలాది చేపలు మృతి చెందిన ఘటనపై నివేదికను బహిర్గతం చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం మత్స్యకారులతో కలసి నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 20వ తేదీన బోయపాడు, రాజయ్యపేట సముద్రతీరాల్లో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయన్నారు. సెంట్రల్ మైరెన్, ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఫిషరీస్శాఖ అధికారులు వచ్చి పరిశీలించారన్నారు. చనిపోయిన చేపలు, సముద్రజలాల శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపించారని చెప్పారు. సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు నివేదికలు బహిర్గతం చేయలేదని తెలిపారు. గతంలో కూడా ఇలాగే వేల సంఖ్యలో చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వస్తే సముద్రంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉందని, వాతావరణంలో వచ్చిన మార్పులు వల్ల చేపలు చనిపోయాయని సంబంధిత అధికారులు నివేదికలు ఇచ్చారన్నారు. ఇప్పుడు కూడా వాస్తవాలు దాచిపెట్టి రసాయన కంపెనీలను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాకినాడ జిల్లాలో ప్రజ లు వ్యతిరేకించడంతో బల్క్డ్రగ్పార్క్ను ప్రభుత్వం రాజయ్యపేట సమీపంలో ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. ఈ పార్క్ కార్యకలాపాలు ప్రారంభమైతే చేపలే కాకుండా మనుషులు కూడా మరణించే ప్రమాదం ఉందని చెప్పారు. మత్స్యకారుల ఉపాధికి, ఉనికి ముప్పు వాటిల్లుతుందన్నారు. మత్స్యకారుల మనుగడకు నష్టం కలిగించే చర్యలకు ప్రభు త్వం పూనుకోవడం సమంజసం కాదన్నారు. తక్షణమే బల్క్ డ్రగ్పార్క్ ఏర్పాటును ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మత్స్యకార నాయకులు ఎం.మహేష్, సోమేష్, బి.నూకరాజు, కె.దేముడు, వీరబాబు, అప్పలరాజు, కాశీరావు, రమణ,కాశీ, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం నాయకుల డిమాండ్


