తుమ్మపాల: ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఈ నెల 28న విధిగా పల్స్ పోలియో చుక్కలు వేయాలని, ఈ మేరకు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ప్రచారం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన అధికారుల సమావేశంలో పల్స్ పోలియో కార్యక్రమం, స్టాప్ డయేరియా పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ రోజు పోలియో చుక్కలు వేయని పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటి వద్ద తప్పనిసరిగా వేయాలని, శత శాతం లక్ష్యసాధన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 16 నుంచి జూలై 30వ తేదీ వరకు గ్రామాల్లో స్టాప్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 6 ఏళ్లలోపు బిడ్డలు ఉన్న తల్లిదండ్రులందరూ చిన్న పిల్లల్లో వచ్చే అతిసార వ్యాధి నివారణ, ఓఆర్ఎస్ ద్రావణం తయారుచేసే విధానం, వ్యాధి గ్రస్తులైన పిల్లలకు జింక్ మాత్రలు పంపిణీ చేయడంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అఽధికారి డాక్టర్ హైమావతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చంద్రశేఖర్, జిల్లా గణాంక అధికారి రామచంద్రరావు పాల్గొన్నారు.


