సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన దుకాణాలకు ఈవో జె.వెంకటరావు సమక్షంలో బహిరంగ వేలం, సీల్డ్ టెండర్ల ప్రక్రియను నిర్వహించారు. కొండపైన, దిగువన ఉన్న 25 దుకాణాలకు మూడేళ్ల కాలపరిమితికి నిర్వహించిన ఈ వేలంలో దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. ఇందులో అత్యల్ప లీజు ధర రూ.1,600 కాగా, అత్యధికంగా కొండపై కేశఖండన శాల వద్ద ఉన్న దుకాణానికి రూ.33,951 లభించింది. అలాగే కొండపైన ప్రసాదాల విక్రయశాల వద్ద బయోడిగ్రేడబుల్ పేపర్ సంచులు విక్రయించుకునే హక్కును ఏడాది కాలపరిమితికి రూ.12 లక్షల భారీ మొత్తానికి దక్కించుకున్నారు. దేవస్థానంలో నిరుపయోగంగా ఉన్న ఐరన్ సామాగ్రి కేజీ రూ.27.50 చొప్పున, హుండీల్లో భక్తులు సమర్పించిన ఇత్తడి గంటలు, భజనతాళాలు, కుందులు కేజీ రూ.810 గరిష్ట ధరకు వేలం వెళ్లాయి. ఈ వేలం ప్రక్రియను దేవస్థానం ఏఈవోలు పిల్లా శ్రీనివాసరావు, రమణమూర్తి, సూపరింటెండెంట్లు రాజ్యలక్ష్మి, సత్యవాణి, సిబ్బంది చక్రవర్తి తదితరులు పర్యవేక్షించారు.


