నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట, బోయపాడు సముద్రతీరాల్లో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడుతున్న ఘటనపై విచారణ జరపాలని వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ డిమాండ్ చేశారు. మృతి చెంది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన చేపలను బోయపాడు తీరంలో ఆదివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థరసాయనాల వల్లే చేపలు మృత్యువాత పడుతున్నాయంటూ మత్స్యకారులనుంచి ఆరోపణలు వస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాంతాల్లో వేటాడిన చేపలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు. చేపల మృతిపై కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వారు పూర్తిగా అధ్యయనం చేయాలని కోరారు. వ్యాధులుసోకి మరణించాయా, లేక సముద్రజలాలు కలుషితమయ్యాయా అనేది నిర్ధారించకపోతే దాని ప్రభావం మత్స్యకారుల ఉపాధిపై పడుతుందన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, పార్టీ కార్యదర్శి ఏరిపిల్లి నాగేశు, మత్స్యకార నాయకులు యజ్జల అప్పలరాజు, పిక్కి తాతీలు, పిక్కినూకరాజు, అప్పలరాజు,మైలపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


