మురళీనగర్(విశాఖ): పాలిసెట్ ఫలితాలు వెలువడిన 40 రోజుల తర్వాత ఎట్టకేలకు పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిషికేషన్ జారీ అయ్యింది. ఈనెల 24 నుంచి జూలై 4వ తేదీ వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈసారి ఇంజినీరింగు ప్రవేశాల మాదిరిగానే ఆన్లైన్లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. ఆన్లైన్ పరిశీలనలో సమస్యలు ఎదురైన అభ్యర్థులు మాత్రమే ఈనెల 25 నుంచి జూలై 1 వరకు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఈనెల 29 నుంచి జూలై 3 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూలై 4న ఆప్షన్ల మార్పిడికి అవకాశం కల్పించారు. జూలై 6న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూలై 7 నుంచి 10వ తేదీ లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ఆ కాపీని సంబంధిత కాలేజీల్లో సమర్పించాల్సి ఉంటుంది. జూలై 7వ తేదీ నుంచే పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభమవుతాయి.
అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్లు
రిజిస్ట్రేషన్ సమయంలో పాలిసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్తోపాటు అభ్యర్థి ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ లేదా తత్సమానమైన అర్హతకు సంబంధించి మార్కుల మెమో, 4వ తరగతి నుంచి 10తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, రిజర్వేషన్ వర్తించే వారు కుల ధ్రవీకరణ పత్రం, మైనార్టీ సర్టిఫికెట్, ఎస్ఎస్సీ టీసీ, 2023 జనవరి 1వతేదీన లేదా ఆ తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఓసీల్లో అర్హత కలిగిన వారు ఈడబ్ల్యుస్ సర్టిఫికెట్, ప్రయివేటు విద్యార్థులైతే రెసిడెన్స్ సర్టిఫికెట్, నాన్ లోకల్ అభ్యర్థులైతే పది సంవత్సరాల రెసిడెన్స్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. పీడడబ్ల్యూడీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ కేటగిరీ విద్యార్థులు విజయవాడ బెంజ్ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో వారికి నిర్దేశించిన తేదీల్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వివరాలకు https:// polycet.ap.gov.in వెబ్ సైట్లో చూడవచ్చు.


