● హీరో గవిరెడ్డి శ్రీనివాస్
నర్సీపట్నం:‘మా ఇంటి బంగారం’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందని నటుడు గవిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సినిమా విజయవంతం కావడంతో శుక్రవారం నర్సీపట్నం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సమంత ప్రధాన పాత్రలో నటించగా తాను అల్లుడిగా నటించానని తెలిపారు. కుటుంబంలో కోడలి పాత్ర ఎలా ఉండాలనే కథా అంశం ఆధారంగా చిత్రాన్ని నిర్మించామన్నారు. శుభం సినిమా నా జీవితాన్ని మలుపు తిప్పిందని, మా ఇంటి బంగారం మరింత క్రేజ్ తెచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. తాను హీరోగా నటించిన ఎఫిక్, ఆత్రేయపురం బ్రదర్స్, చీన్ టపాస్ డుం డుం చిత్రాలు జూన్, జూలైలో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ తాను సినిమారంగంలోకి అడుగుపెట్టేందుకు బాటలు వేసిందన్నారు.18 ఏళ్ల తన సినిమారంగం ప్రయాణంలో కథా రచయిత, దర్శకుడుగా పేరు తెచ్చుకున్నానన్నారు. హీరోయిన్ సమంత శుభం చిత్రం దగ్గర నుంచి మా ఇంటి బంగారం వరకు తనకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారన్నారు. తాను పుట్టిన ప్రాంతమైన నర్సీపట్నంలో మా ఇంటి బంగారం సినిమా కుటుంబ సభ్యులు, తన స్నేహితుల మధ్య చూడటం ఆనందంగా ఉందన్నారు. హీరో గవిరెడ్డి శ్రీనివాస్ వెంట సినిమా యూనిట్ లోకల్ మేనేజర్ షేక్ రజాక్, చీన్ టపాస్ డుం డుం నిర్మాత నాగులపల్లి శ్రీను ఉన్నారు.


