ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల దత్తత స్వీకార కార్యక్రమానికి దాతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర గురువారం జూలోని ఒక జీబ్రాను ఏడాది కాలానికి దత్తత తీసుకున్నారు. దత్తత నిమిత్తం రూ.60 వేల విరాళాన్ని జూ క్యూరేటర్ జి.మంగమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా సిరి సహస్రకు క్యూరేటర్ దత్తత స్వీకార పత్రాన్ని అందజేశారు. అలాగే బుక్కవరపు రమాదేవి అనే దాత ఒక నక్షత్ర తాబేలును ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. దీనికోసం ఆమె రూ.10 వేల విరాళాన్ని క్యూరేటర్కు సమర్పించారు. వన్యప్రాణులపై ప్రేమతో దత్తతకు ముందుకు వచ్చిన దాతలిద్దరినీ జూ అధికారులు అభినందించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని క్యూరేటర్ మంగమ్మ కోరారు.
రూ.60 వేల విరాళం అందించిన
మజ్జి సిరి సహస్ర


