
ఉత్సాహంగా 5కె రెడ్ రన్ మారథాన్
అనకాపల్లి: ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వ్యాధి సోకిన రోగులకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నామని డీఎంహెచ్వో ఎం.ఎస్.వి.కె. బాలాజీ తెలిపారు. 5కె రెడ్ రన్ మారథాన్ను గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. యూత్ఫెస్ట్ –2024–25లో భాగంగా ఏపీ ఎయిడ్స్ నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పూడిమడక జాతీయ రహదారి నుంచి ఎన్టీఆర్ క్రీడా మైదానం వరకు విద్యార్థులతో ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఎయిడ్స్పై అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, కళాశాలల్లో ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం 5కె రెడ్ రన్ పోటీల్లో గెలిపొందిన బాలుర విభాగంలో రామానాయుడు, రామతేజ, బాలికల విభాగంలో దివ్యదుర్గ, నాగమణిలకు ప్రథమ, ద్వితీయ బహుమతులుగా రూ.7 వేలు, రూ.3 వేలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ, సంస్థ క్లస్టర్ మేనేజర్ రామచందర్, సీఎస్వో డాక్టర్ స్పందన, ఏసీడీసీ కౌన్సిలర్ రవి, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా 5కె రెడ్ రన్ మారథాన్

ఉత్సాహంగా 5కె రెడ్ రన్ మారథాన్