
టిప్పర్ లారీకి రూ.80 వేలు జరిమానా
కశింకోట: మండలంలోని బయ్యవరంలో అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని గుర్తించి రవాణా శాఖ అధికారులకు అప్పగించగా రూ.80 వేలు జరిమానా విధించినట్లు సీఐ అల్లు స్వామినాయుడు గురువారం తెలిపారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ లారీని పట్టుకున్నామన్నారు. ఇటీవల జిల్లాలో రహదారులపై అధిక బరువుతో ప్రయాణిస్తున్న లారీలు పలు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో రహదారి భద్రత, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వాహనదారులు చట్టాలకు, నిబంధనలకు లోబడి వాహనాలను నడపాలన్నారు. తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.