
ఫార్మా వ్యర్థాలతో ముప్పుపై ఫిర్యాదు
అచ్యుతాపురం రూరల్: సెజ్, ఫార్మా పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలు నేరుగా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి విడిచిపెడుతుండడంతో అరుదైన మత్స్య సంపదను కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం అచ్యుతాపురం ఏపీఐఐసీ జెడ్ఎం కార్యాలయంలోని ఫైనాన్స్ మేనేజర్ కృష్ణవేణికి పూడిమడక మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు రాత్రి సమయాల్లో సెజ్ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ రసాయన జలాలు సెజ్ సీసీ కాలువల ద్వారా ఉప్పుటేరులో కలుస్తున్నాయన్నారు. దీంతో ఉప్పుటేరులో పెద్ద ఎత్తున మత్స్య సంపద మృత్యువాత పడుతోందని చెప్పారు. రసాయనాల కారణంగా పొగురు కొండలు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణ ప్రదేశంలో వేలాది చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు వాపోయారు. ఉప్పుటేరుపై ఆధారపడి జీవిస్తున్న వందలాది మంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారన్నారు. ఉప్పు తయారీ కార్మికులు సైతం ఉపాధి కోల్పోయారన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పూడిమడక మత్స్యకారుల ఆరోగ్యానికి, ఆర్థికాభివృద్ధికి నష్టం కలిగిస్తున్న సెజ్ పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించకుంటే భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా మత్స్యకార సంఘం నాయకులు చోడిపల్లి అప్పారావు, వైస్ ఎంపీపీ వాసుపల్లి పద్మ శ్రీనివాసరావు, కో–ఆప్టడ్ ఎంపీటీసీ చేపల శ్రీరాములు, అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు.