పాడేరు: కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజన విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు పసుపులేటి బాలరాజు విమర్శించారు. మారికవలస గిరిజన గురుకుల విద్యాలయం ఎత్తివేతకు నిరసనగా ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గురువారం సాయంత్రం ఆయన పరామర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో గిరిజన విద్యార్థుల ప్రాథమిక విద్యకు ప్రధాన ఆధారంగా ఉన్న మారికవలస గురుకులాన్ని విద్యా సంవత్సర మధ్యలో అర్ధంతరంగా ఎత్తివేయడం దారుణమన్నారు. అక్కడే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలనుకుంటే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన అదనపు భవనాలను వినియోగించుకోవాలన్నారు. గిరిజనుల అభ్యున్నతిపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందన్నారు. మారికవలస గిరిజన గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.


