● మారికవలస పాఠశాల ఎత్తివేతపై ఆగ్రహం
● రెండో రోజూ ఐటీడీఏ ఎదుట నిరసన
● పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్
● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల మండిపాటు
గిరిజన విద్యార్థులసంక్షేమానికే ప్రాధాన్యం
కలెక్టర్ నిశాంతి
పాడేరు: మారికవలస స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ నిశాంతి స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. మారికవలస పాఠశాల వ్యవహారంపై గురువారం ఐటీడీఏ కార్యాలయంలో విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ మారికవలస పాఠశాలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా అభివృద్ధి చేసి ప్రస్తుతం 360 మంది విద్యార్థులకు విద్యా, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 5 నుంచి 8వ తరగతి వరకు ఉన్న 225 మంది విద్యార్థులను పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు నిర్వహించి తల్లిదండ్రులకు పూర్తి వివరాలు తెలియజేశామన్నారు. 9, 10వ తరగతులకు చెందిన 135 మంది విద్యార్థులను కృష్ణాపురం, జి.మాడుగుల, సబ్బవరం, గుమ్మకోట, పెదబయలు, దేవరాపల్లి, కొయ్యూరు తదితర స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లలో కొనసాగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ మాట్లాడుతూ భవిష్యత్లో ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు చేరే అవకాశముందన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకుంటున్నామని, మారికవలస బా య్స్ పాఠశాలలోనే విద్య కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుకుంటే, ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు. జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) శృతి పాల్గొన్నారు.
ఎన్నో ఏళ్లుగా మెరుగైన విద్యను అందిస్తున్న చదువుల గుడిని దూరం చేయడంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాత్రికి రాత్రి పాఠశాలను ఖాళీ చేయించి నేరస్తుల మాదిరి విద్యార్థులను బస్సుల్లో కర్కశంగా తరలించిన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై గిరిజనం మండిపడింది. మారికవలస గిరిజన గురుకుల విద్యాలయం ఎత్తివేతపై ఆగ్రహం వ్యక్తమైంది. పాఠశాలను యథావిధిగా కొనసాగించాల్సిందేనని బుధవారం పాడేరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఐటీడీఏ ప్రధాన గేటు వద్ద బైటాయించి నిరసనకు దిగారు. రాత్రి వేళ జరిగిన చర్చలు ఫలించకపోవడంతో అక్కడే రాత్రంతా ఆందోళన కొనసాగించారు. గురువారం కూడా వివిధ గిరిజన, ఆదివాసీ హక్కుల సంఘాల నాయకులు చేరడంతో నిరసన మరింత ఉధృతంగా సాగింది.


