సాక్షి, పాడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అరకులోయ మండలం గన్నెల ప్రాంతంలో పర్యటించనున్నట్లు కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లో ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గన్నెల ప్రాంతంలో ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం ఉదయం హెలికాప్టర్లో సీఎం గన్నెలకు చేరుకుంటారని చెప్పారు. ఆ తరువాత ఆర్.కె.నగర్ గ్రామాన్ని సందర్శించి ‘సంజీవని’కార్యక్రమం లబ్ధిదారులతో ముఖాముఖీ నిర్వహించనున్నారని తెలిపారు. అనంతరం గన్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం పాల్గొని వివిధ విభాగాల స్టాళ్లను సందర్శిస్తారని వివరించారు.


