అరకు ఎంపీ తనుజారాణి
పాడేరు రూరల్: గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడడం బాధాకరమని అరకు ఎంపీ తనుజారాణి అన్నారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. విశాఖపట్నం మారికవలస గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులను బలవంతంగా వివిధ పాఠశాలలకు తరలించడం గిరిజనుల పట్ల కక్షసాధింపు చర్యేనని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించవలసిన ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను పెంచిపోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన పేద విద్యార్థులు అనే చిన్నచూపుతోనే వారికి ఇష్టంలేకపోయినా తరలించారని, ఇదే మీ పిల్లలైతే ఈవిధంగానే చేస్తారా అని ప్రశ్నించారు. తెలవారుజాము నుంచే విద్యార్థులను తరలించే తీరు చూస్తే ఆవేదన కలిగిందన్నారు. నేరస్తుల పట్ల కూడా ఎవరూ ఈ విధంగా వ్యవహరించరని చెప్పారు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఏవిధంగా తరలిస్తారని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గుడులుగోపురాలపై కూడా కూటమి ప్రభుత్వ పాలకుల కన్ను పడిందన్నారు. ఇప్పటికై నా తప్పు తెలుసుకుని ఆదివాసీ విద్యార్థులను మారికవలస పాఠశాలలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఎంపీ చెప్పారు.


