విద్యార్థుల తరలింపు విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు పాఠశాలకు చేరుకుని పిల్లలతో మాట్లాడారు. అనంతరం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ పిల్లలను భయభ్రాంతులకు గురిచేసి తరలించడం అమానుషమన్నారు. ‘ఆ పసిబిడ్డలు చేసిన తప్పేంటి? వారి చదువులు, భవిష్యత్తుతో ఇలా ఆడుకోవడం సరికాదు’ అని మండిపడ్డారు. సీవోఈ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు అద్దె భవనంలో దాన్ని నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న మారికవలస గురుకులాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.


