తుమ్మపాల : సాంస్కృతిక రంగానికి, కళాకారులకు సరైన ప్రోత్సాహం లేనందువల్ల కళా రంగం దుర్భరమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుందని, కళాకారుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి సంక్షేమ పథకాలు అందించాలని ప్రజానాట్యమండలి కళా సంస్థ జిల్లా సమితి ఆధ్వర్యంలో కళాకారులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో జానపద గ్రామీణ పౌరాణిక పద్మ నాటక రంగాలు కళారూపాలు ఉన్నాయని, వాటికి ప్రభుత్వం నుంచి సరైన ఆదరణ, ప్రోత్సాహం కరువైందని జిల్లా నాయకులు ఎన్.అప్పారావు, వై.ఎన్. భద్రం అన్నారు. ఆయా కళా రంగాలలో నెపుణ్యం కలిగిన కళాకారులకు గుర్తింపు లేకుండా పోయిందని, గతంలో కళాకారులకు ప్రత్యేకమైన పెన్షన్ విధానం ఉండేదని, కళాకారులకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదన్నారు. సమాజాన్ని చైతన్యవంతుల్ని చేస్తూ వినోదాన్ని విజ్ఞానాన్ని పంచే కళాకారుల పరిస్థితి దుర్భరంగా తయారైందన్నారు. కళారంగాన్ని కళారూపాలను, కళాకారులను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సాంస్కృతిక శాఖకు ప్రతి ఏటా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయింపుతో పాటు అర్హత కలిగి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి పేద కళాకారునికి పదివేల రూపాయలు పెన్షన్, ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, నెలలో కనీసం 15 రోజుల పాటు కళాకారులకు వేతనంతో కూడిన కళా ప్రదర్శనలకు అవకాశాలు కల్పించాలన్నారు. నంది నాటకోత్సవాల్లో గ్రామీణ జానపద కళారూపాల విభాగాలను పోటీల్లో చేర్చాలని, ప్రతి ఏటా తప్పనిసరిగా నంది నాటకోత్సవాలు నిర్వహించి ప్రోత్సహించాలన్నారు. ప్రతి పేద కళాకారుడికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాలన్నారు. ప్రభుత్వం ఏటా అందించే కళారత్న, ఉగాది పురస్కారాల ఎంపికలో పారదర్శకత నిజాయితీ ప్రదర్శించాలని అన్నారు. కళాకారులకు బస్సు, రైలులో ఉచితంగా ప్రయాణించడానికి సౌకర్యం కల్పించాలని కోరారు.


