● గంటల లెక్కన బోధనకు రేపటి నుంచి ఇంటర్వ్యూలు
విశాఖ విద్య: బోధనా సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ యంత్రాంగం ఎట్టకేలకు గంటల లెక్కన బోధించే తాత్కాలిక సిబ్బంది నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పేరిట ఆదివారం ఓ ప్రకటన విడుదలైంది. ఈ నెల 25న కంప్యూటర్ ఇంజినీరింగ్ అండ్ సిస్టమ్ ఇంజినీరింగ్, ఐటీ అండ్ సీఏ, మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 28న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 29న ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ, మైరెన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజినీరింగ్, జియో ఇంజినీరింగ్ విభాగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని ఏయూ ప్రకటించింది. ఇప్పటికే సకాలంలో బోధన అందక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఈ తాత్కాలిక నియామకాలు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో చూడాలి. అలాగే ఇంటర్వ్యూల నిర్వహణలో పారదర్శకత పాటిస్తారా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ముమ్మరంగా వాహన తనిఖీలు
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి సమీపంలో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ ఎల్. సురేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక పార్టీ పోలీసులు పర్యాటక కార్లు, ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, డబ్బులకు ఆశపడి యువత గంజాయి, హ్యాష్ ఆయిల్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టేందుకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.


