● అరునెలలుగా పారిశుధ్య
కార్మికుడి వెతలు
సీలేరు: సీలేరు మేజర్ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న కుర్ర చింటూకు గత ఆరు నెలలుగా జీతం అందకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఐదేళ్ల కిందట ఒడిశా నుంచి వలస వచ్చిన అతను, భార్య, నలుగురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తోటి కార్మికులకు జీతాలు వస్తున్నా, తనకు మాత్రం ఆరు నెలలుగా రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా, బ్యాంకు ఖాతాకు సంబంధించిన సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆలస్యమైందని, తక్షణమే జీతం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి పెండింగ్ జీతం ఇప్పించాలని ఆయన కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.


