
సాంబశివరావుకు ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్
మద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర యూనివర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగం విశ్రాంత ఆచార్యులు ఎన్.సాంబశివరావు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్)లో సీనియర్ ఫెలోషిప్కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఐఐపీఏ) విశాఖ ప్రాంతీయ కేంద్రం సభ్యులు గురువారం ఘనంగా సత్కరించారు. ఐఐపీఏ విశాఖ కేంద్రం చైర్మన్ ఆచార్య ఆర్.సుదర్శనరావు మాట్లాడుతూ విశాఖలో ఉద్యోగుల జీవన నాణ్యతపై ఉద్యోగుల సంక్షేమ పద్ధతుల ప్రభావం అనే అంశంలో పరిశోధనకు సాంబశివరావు ఎంపికయ్యారని తెలిపారు. కామర్స్, మేనేజ్మెంట్ విభాగం నుంచి 2024–26 సంవత్సరానికి ఈయన ఒక్కరే ఎంపికవడం విశేషమన్నారు. ఐఐపీఏ కార్యదర్శి ఆచార్య పీటేటి ప్రేమానందం మాట్లాడుతూ ఇలాంటి ఫెలోషిప్లకు ఏయూ ఆచార్యులు ఎంపికవడం వర్సిటీకి జాతీయస్థాయిలో మంచి గుర్తింపును తెస్తుందన్నారు. కార్యక్రమంలో ఐఐపీఏ సభ్యులు ఆచార్య షమీం, డాక్టర్ హరిబాబు, డాక్టర్ రత్నరాజు, డాక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.