అరుణక్కకు అంతిమ వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

అరుణక్కకు అంతిమ వీడ్కోలు

Jun 21 2025 3:53 AM | Updated on Jun 21 2025 3:53 AM

అరుణక

అరుణక్కకు అంతిమ వీడ్కోలు

పెందుర్తి (విశాఖపట్నం జిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లా కింటుకూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్ట్‌ నేత వెంకట రవివర్మ చైతన్య అలియాస్‌ అరుణక్కకు శుక్రవారం విప్లవ నినాదాలతో తుది వీడ్కోలు పలికారు. ఆమె భౌతికకాయాన్ని రంపచోడవరం నుంచి స్వగ్రామం పెందుర్తి మండలం కరకవానిపాలేనికి శుక్రవారం ఉదయం తీసుకొచ్చారు. భారీగా తరలివచ్చిన ప్రజా సంఘాల నేతలు, ప్రజలు రాంపురం వద్ద జాతీయ రహదారి నుంచి కరకవానిపాలెం వరకు అరుణక్క మృతదేహాన్ని ఊరేగింపుగా తరలించారు. దారి పొడవునా అరుణ పతాకాలు.. ప్రజా కళామండలి అరుణోదయ కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు. అనంతరం అరుణక్క స్వగృహం వద్ద విప్లవగీతాలు పాడి నివాళులర్పించారు. కరకవానిపాలెం శ్మశానవాటికలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో విప్లవ సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపారు. రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అత్తిలి విమల, పాత్రికేయుడు, వీక్షణం పత్రిక ఎడిటర్‌ వేణుగోపాల్‌, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ విశాఖ, విజయనగరం జిల్లాల ఏరియా కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కార్యదర్శి రెహమాన్‌, అమరవీరుల బంధుమిత్రుల రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్‌.వెంకటలక్ష్మి, మహిళా చేతన అధ్యక్షురాలు కె.పద్మ, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ప్రతినిధి కె.పద్మ, భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీరామ్మూర్తి, దళిత విముక్తి కన్వీనర్‌ ఎస్‌.వి రమణ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.ఏడుకొండలు, బి.రామకృష్ణ, పలువురు పౌరహక్కుల నేతలు, ప్రజా సంఘాల సానుభూతి పరులు పాల్గొన్నారు.

ఉద్యమాన్ని ఎన్‌కౌంటర్లు ఆపలేవు:

ప్రజా/పౌర హక్కుల సంఘాల నేతలు

ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాన్ని నిర్మూలించాలని చూస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి ఆరోపించారు. అయితే కగార్‌ ఆపరేషన్లు, ఎన్‌కౌంటర్ల పేరిట హత్యలు ఉద్యమాలను ఆపలేవని స్పష్టం చేశారు. ప్రజలకు కష్టాలు, బాధలు ఉన్నంత వరకు విప్లవోద్యమాలు కొనసాగుతాయన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించాలన్నారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్‌ మాట్లాడుతూ కామ్రేడ్‌ అరుణక్క, గాజర్ల రవి, నంబాల కేశవరావు వంటి నేతల్ని ప్రభుత్వ హత్యలతో ఉద్యమకారులను భయపెట్టాలని చూ స్తోందని.. అలాంటి వాటికి ఉద్యమకారులు తలవంచరని స్పష్టం చేశారు. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అత్తిలి విమల మాట్లాడుతూ పాలకులు ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఆదివాసీల నివాస ప్రాంతాల ను జీవనోపాధులను దె బ్బతీసే ప్రయత్నం చేస్తు న్నారని విమర్శించారు. ఆదివాసీ లు, మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్ల ద్వారా హత్యలు చేయడం మానుకుని శాంతి చర్చలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్పొరేట్‌లకు అడవులను కట్టబెట్టే విధానాలను ప్రభుత్వాలు విడనాడాలని హితవు పలికారు.

ముందుగానే పట్టుకుని హత్య:

అరుణ తండ్రి లక్ష్మణరావు

తన కుమార్తె అరుణను పోలీసులు ముందుగానే పట్టుకుని హత్య చేశారని ఆమె తండ్రి లక్ష్మణరావు ఆరోపించారు.

అరుణక్కకు అంతిమ వీడ్కోలు1
1/2

అరుణక్కకు అంతిమ వీడ్కోలు

అరుణక్కకు అంతిమ వీడ్కోలు2
2/2

అరుణక్కకు అంతిమ వీడ్కోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement