
ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా
● సంఘటన స్థలంలో ఇద్దరు మృతి
● మరో ఏడుగురికి తీవ్ర గాయాలు
● అంటాబొంగు ఘాట్ ఎక్కలేక
వ్యాన్ అదుపు తప్పడంతో ప్రమాదం
● క్షతుగాత్రులకు ముంచంగిపుట్టు
సీహెచ్సీలో వైద్య సేవలు
ముంచంగిపుట్టు: మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ అంటా బొంగు ఘాట్లో శుక్రవారం సాయంత్రం వ్యాన్ బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డా రు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన వంగపండు తిరుపతి అనే మేస్త్రి మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ సుత్తిగూడ గ్రామంలో సెంట్రింగ్ సామాన్లు కొనుగోలు చేశాడు. వీటిని తీసుకువెళ్లేందుకు గుమ్మడం గ్రామానికి చెందిన 10 మంది కూలీలతో వ్యాన్లో వచ్చాడు. అక్కడి మెటీరియల్ను తీసుకువెళ్తుండగా అంటాబొంగు ఘాట్ వద్దకు వచ్చే సరికి ప్రమాదానికి గురైంది. ఘాట్ ఎక్కలేక వ్యాన్ వెనక్కి వచ్చేసింది. దీనిని గమనించిన డ్రైవర్ బయటకు దూకేసి పారిపోయాడు. దీంతో వ్యాన్ అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయి, బోల్తా పడింది.సెంట్రింగ్ సామాన్లు వ్యాన్లో ఉన్న కూలీలపై పడిపోయాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు హూటహూటిన వచ్చి గాయపడిన వారిని బయటకు తీశారు. సంఘటన స్థలంలో కూలీల్లో సింగరాపు శివ(39), సింగరాపు రమణ (45) మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఉన్న వడ్డ గణపతి(33), దవరసింగి కుమార్(35), సింగరాపు రమేష్(34), నారపాటి బాబురావు(45), నారపాటి భాస్కరరావు(42), వంగపండు తిరుపతి(39), సింగరాపు శంకరరావు(38)ను ప్రైవేట్ వాహనంలో స్థానిక సీహెచ్సీకి తీసుకువచ్చారు. స్థానిక వైద్యాధికారి వివేక్, సిబ్బంది వారికి వైద్య సేవలు అందించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని పాడేరు జిల్లా ఆస్పత్రికి పంపిస్తామని వారు తెలిపారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ జె.రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారాన్ని బాధిత కుటుంబాలకు ఫోన్లో తెలియజేశారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా

ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా