
నర్సుల బదిలీల బాగోతం
మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖలో ముగిసిన నర్సుల బదిలీల ప్రక్రియ తీవ్ర గందరగోళానికి, అవినీతి ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు, భారీగా చేతులు మారిన ముడుపులకే ప్రాధాన్యతనిచ్చి, నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్యంతో బాధపడేవారికి, ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి కనీస మానవత్వం చూపకుండా, అన్యాయంగా పోస్టింగులు ఇవ్వడంపై నర్సుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
క్యాన్సర్ బాధితులకూ తప్పని కష్టాలు
బదిలీల ప్రక్రియలో అధికారులు కనీస మానవతా దృక్పథాన్ని కూడా చూపలేదని పలు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.
● క్యాన్సర్తో బాధపడుతున్న ఆరుగురు నర్సులను విశాఖకు సమీపంలో కాకుండా, సుదూర ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు బదిలీ చేశారు.
● రెండు కాళ్లు సరిగా పనిచేయని ఒక దివ్యాంగ నర్సుకు నగరంలో పోస్టులు ఖాళీ లేవని చెప్పి, విజయనగరానికి పంపించారు.
● మానసిక వికలాంగులైన పిల్లలున్న ఒక తల్లిని కేజీహెచ్ నుంచి ఆంధ్రా మెడికల్ కాలేజీకి బదిలీ చేయగా, అలాంటి పరిస్థితే ఉన్న మరో నర్సును సింహాచలానికి పంపడం వివాదాస్పదమైంది.
● 50 ఏళ్లు పైబడిన నర్సులను నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు జిల్లాకు పంపించారు.
● ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న ఒక నర్సుకు ఏకంగా ఏఎస్ఆర్ జిల్లాలోని హుకుంపేటలో పోస్టింగ్ ఇచ్చారు.
జీవోలు బుట్టదాఖలు
నర్సుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, నిబంధనలను బుట్టదాఖలు చేశారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి, తమకు కావాల్సిన వారికి బదిలీలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ మార్గదర్శకాలను, నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. మైదాన ప్రాంతాల్లో ఖాళీలు లేవని సాకులు చెప్పి, 50 నుంచి 55 సంవత్సరాలు పైబడిన నర్సులను అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేశారు. చాలా కాలంగా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న నర్సులను మైదాన ప్రాంతాలకు బదిలీ చేయకుండా.. నగరంలో ఖాళీలు లేవని అధికారులు బహిరంగంగా చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఏజెన్సీలో పనిచేస్తున్న వారిని మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలి. ఏజెన్సీలో ఎప్పుడూ పనిచేయని వారిని కూడా అక్కడ బదిలీ చేయడానికి కొంతమంది అధికారులు ఇష్టపడకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. బదిలీల విషయంలో కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధుల పేర్లను వాడుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
విచారణ జరగాల్సిందే..
ఈ వ్యవహారంపై ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పి.రాధారాణిని వివరణ కోరగా.. ‘బదిలీలన్నీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే జరిగాయి. ఎలాంటి అవకతవకలు జరగలేదు. పోస్టులు ఖాళీగా ఉన్నచోట మాత్రమే ఇవ్వగలిగాం. ఖాళీలు లేకపోతే మేమేమీ చేయలేం’అని తెలిపారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో మొత్తం 1090 మంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకోగా, 740 మందికి బదిలీలు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే అధికారుల వివరణకు, క్షేత్రస్థాయిలో జరిగిన అన్యాయాలకు పొంతన లేకపోవడంతో బదిలీల ప్రక్రియపై పూర్తిస్థాయి విచారణ జరపాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు.
పైరవీలకే పెద్దపీట?
నిబంధనలకు నీళ్లు..
మానవత్వానికి తిలోదకాలు