
కుటుంబమంతాఉద్యమ బాటే!
సాక్షి,పాడేరు/రంపచోడవరం: ఆంధ్రా,ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుపార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కీలక నేతలను ఎన్కౌంటర్ రూపంలో కోల్పోవడం ఆపార్టీకి గట్టి దెబ్బతగిలింది. మారేడుమిల్లి–రంపచోడవరం మండలాల సరిహద్దులోని పోలీసులు–మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి, అలియాస్ ఉదయ్, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, అలియాస్ అరుణక్క, ఛత్తీస్గఢ్కు చెందిన ఏసీఎం క్యాడర్ మహిళా మావోయిస్టు అంజూగా పోలీసులు నిర్థారించారు.
మూడు నెలలుగా టార్గెట్
మావోయిస్టు పార్టీ ఉద్యమానికి కొద్దోగొప్పో మిగిలిన కీలక క్యాడర్ను లక్ష్య్యంగా చేసుకుని ఇటీవల కాలంలో పోలీసు బలగాలు ఏవోబీలో కూంబింగ్ విస్తృతం చేశాయి. దీంతో ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి తరలివచ్చిన మావోయిస్టులు రంపచోడవరం డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో తలదాచుకున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమై గాలింపు చేపట్టడంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
● గత నెలలో వై.రామవరం–కొయ్యూరు సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కాకర్ల పండన్న అలియాస్ జగన్, డీసీఎం క్యాడర్ రమేష్ మృతిచెందారు. ఇదే సమయంలో మావోయిస్టుల గురించి కీలకసమాచారం సేకరించిన పోలీసు బలగాలు గాలింపు కొనసాగించాయి. ఏవోబీలో పెద్దదిక్కుగా ఉన్న మావోయిస్టు కీలక నేతలు గాజర్ల రవి, అరుణను టార్గెట్గా చేసుకుని చేపట్టిన గాలింపు చర్యల్లో పోలీసులదే పైచేయి అయింది. ఈ ఘటనలో వారిద్దరితో పాటు అరుణకు భద్రత చూసే అంజూ అనే మహిళా మావోయిస్టు ప్రాణాలు కోల్పోయింది.
ఉద్యమంలో కీలకంగా..
ఎన్కౌంటర్లో మృతిచెందిన గాజర్ల రవి, అరుణలు ఏవోబీలో మావోయిస్టు ఉద్యమానికి సారథులుగా పేరొందారు. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం, వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి,అలియాస్ ఉదయ్ గత 20 ఏళ్ల నుంచి ఏవోబీలో మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టు సాయుధ పోరాటాన్ని నడిపాడు. ఒడిశాలోని బలిమెలలో పోలీసు బలగాల లాంచీ పేల్చివేతతో పాటు అనేక హింసాత్మక ఘటనలలో గాజర్ల రవి పాత్రపై కేసులు ఉన్నాయి. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న ఆయనపై దండకారణ్య రాష్ట్రాల్లో సుమారు రూ.కోటి వరకు రివార్డు ఉంది.
● విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెంకు చెందిన వెంకట రవి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ కూడా గత 30 ఏళ్ల నుంచి మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. ఈ సమయంలోనే మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతిని వివాహం చేసుకున్నారు. కొద్ది నెలల క్రితం చలపతి మృతిచెందినప్పటికీ అరుణ మాత్రం ఉద్యమంలోనే కొనసాగుతున్నారు. జోనల్ మహిళా కమిటీలో కీలకంగా వ్యవహరించడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టు సిద్ధాంతాల వ్యాప్తికి ఆమె ఎంతో కృషి చేసినట్టుగా ప్రచారంలో ఉంది. 2018లో డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద అప్పటి ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి శ్రావణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన ఘటనలో అరుణ నిందితురాలుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎన్కౌంటర్లో మృతిచెందిన అంజూ అనే మహిళా మావోయిస్టు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు.
రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి మృతదేహాలు
కింటూరు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం బుధవారం రాత్రి 8.30 గంటలకు భారీ బందోబస్తు మధ్య తీసుకువచ్చారు. ఆస్పత్రి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. మృతదేహాలను చూసేందుకు కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
సేఫ్ జోన్గా భావించి..
ఆంధ్రా ఒడిశా ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే మావోయిస్టులు వై.రామవరం అప్పర్ పార్ట్, విశాఖ ఏజెన్సీ సరిహద్దుల్లో సంచరించేవారు. క్లిష్ట పరిస్థితుల్లో అటు ఒడిశా వెళ్లిపోయే వారు. అయితే గోదావరి బెల్టులో ఎప్పుడు సంచరించిన దాఖాలాలు లేవు. ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్ భావించి మావోయిస్టులు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
మరింత బలహీనం
కీలక నేతలను కోల్పోవడంతో ఏవోబీలో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడింది. ఇప్పటికే పోలీసు నిర్బంధంతో మావోయిస్టు కార్యకలాపాలు దాదాపు స్తంభించాయి. ఉన్న కొద్దిపాటి కీలకనేతలు కూడా వరుస ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతుండటం ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇక దిగువ స్థాయి క్యాడర్లో ఉన్న మావోయిస్టులను కూడా లక్ష్యంగా చేసుకుని పోలీసు బలగాలు ముందుకు కదులుతున్నాయి.
వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు మృతి
కనుమరుగవుతున్న
మావోయిస్టు ఉద్యమం
ఫలిస్తున్న పోలీసుల వ్యూహం
రెండు నెలలుగా రంప ఏజెన్సీలో గాలింపు చర్యలు ముమ్మరం
ముగిసిన గాజర్ల రవి,అరుణక్కల ఉద్యమ శకం
మిగిలిన క్యాడర్పైనా పోలీసుల గురి
పెందుర్తి (విశాఖపట్నం జిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన అరుణక్క కుటుంబమంతా ఉద్యమానికి దగ్గరగా ఉంది. ఆమె స్వస్థలం పెందుర్తి కరకవానిపాలెం. తల్లిదండ్రులు వి.లక్ష్మణరావు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి శాంతి అలియాస్ అర్జునమ్మ గృహిణి. వీరికి వెంకటరవి లక్ష్మి చైతన్య అలియాస్ అరుణక్క, గోపి అలియాస్ ఆజాద్, ఝాన్సీ సంతానం. చిన్ననాటి నుంచి వామపక్ష భావజాలం కలిగిన అరుణక్క దాదాపు మూడు దశాబ్దాల క్రితమే ఉద్యమంలోకి వెళ్లిపోయింది. అనేక పోరాటాల్లో కీలకంగా వ్యవహరించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ప్రస్తుతం పనిచేస్తోంది. ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందడంతో కరకవానిపాలెంలోని కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. అరుణక్క సోదరుడు గోపీ అలియాస్ ఆజాద్ కూడా యుక్త వయసులోనే ఉద్యమం వైపు అడుగులు వేశాడు. ఉద్యమంలో చేరిన కొంతకాలానికే గాలికొండ ఏరియా దళ కమాండర్ హోదా దక్కింది. అయితే అదే సమయంలో ఆజాద్ 2016లో గూడెంకొత్తవీధి అటవీ ప్రాంతం మర్రిపాకల వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. అరుణక్క సోదరి ఝాన్సీ న్యాయవాది. ప్రజా ఉద్యమంలో చురుగ్గా ఉంటారు. గంగవరం పోర్టు నిర్మాణ వ్యవహారంలో మత్స్యకారులకు, యాజమాన్యానికి మధ్య జరిగిన పోరాటంలో ఝాన్సీ మత్స్యకారులకు అండగా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఆమె పోరాటంలో భాగంగా గాయపడితే కేజీహెచ్కు తరలించారు. ఆ సమయంలో కేజీహెచ్ బెడ్ మీద ఆమెకు సంకెళ్లు వేసి చికిత్స చేయడం పెద్ద సంచలనంగా మారింది.
నా కుమార్తెను ప్రభుత్వమే చంపింది:
లక్ష్మణరావు, అరుణక్క తండ్రి
మారేడుమిల్లిలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్. నా కుమార్తె(అరుణక్క)ను పోలీసులు కొద్ది రోజుల క్రితమే పట్టుకుని బంధించి ఇప్పుడు హతమార్చారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే బావిస్తున్నాం. గతంలో కూడా నా కుమారుడు గోపీ అలియాస్ ఆజాద్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం.
పదేళ్ల క్రితం ఎన్కౌంటర్లో మృతి చెందిన అరుణక్క సోదరుడు ఆజాద్
ప్రజాక్షేత్రంలో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సోదరి ఝాన్సీ

కుటుంబమంతాఉద్యమ బాటే!