
క్షమాభిక్షపై ముగ్గురు జీవిత ఖైదీల విడుదల
ఆరిలోవ (విశాఖ): సుప్రీం కోర్టు ఆదేశాలతో క్షమాభిక్షపై విశాఖ కేంద్ర కారాగారం నుంచి ముగ్గురు జీవిత ఖైదీలు బుధవారం విడుదలయ్యారు. హత్య కేసుల్లో జీవిత ఖైదుపై నాలుగు గోడల మధ్య దశాబ్దానికి పైగా గడిపి, ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2009 ఫిబ్రవరి 2 నుంచి ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న విజయనగరం జిల్లా వంగర మండలం తలగాం గ్రామానికి చెందిన ఎ.కృపారావు, 2010 ఆగస్టు నుంచి ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన(ప్రస్తుతం విశాఖపట్నం, మధురానగర్) కేవీఎన్వీ ప్రసాద్, 2014 అక్టోబరు 28 నుంచి జీవిత ఖైదులో ఉన్న అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన వి.కోటేశ్వరరావులకు సత్ప్రవర్తన కారణంగా క్షమాభిక్ష లభించింది. ఈ సందర్భంగా జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్బాబు మీడియాతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు సూచనలతో రాష్ట్రంలో 17 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష లభించిందన్నారు. అందులో విశాఖ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ముగ్గురు అర్హులయ్యారన్నారు. జైళ్ల శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు, నియమ నిబంధనలు పూర్తిచేసి వారిని విడుదల చేసినట్లు తెలిపారు. ఖైదీలు మీడియాతో మాట్లాడుతూ జైల్లో వివిధ కర్మాగార, వ్యవసాయ పనులు చేసినట్లు పేర్కొన్నారు. క్షమాభిక్షపై విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జైల్ సూపరింటెండెంట్తో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్లు సాయిప్రవీణ్, సీహెచ్ సూర్యకుమార్ విడుదలైన ఖైదీలకు పలు సూచనలు చేశారు.