
సీతపల్లి వాగులో మునిగి ఇద్దరి మృతి
రంపచోడవరం: ఇక్కడికి సమీపంలోని సీతపల్లి వాగులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామానికి చెందిన పీతల రాకేష్ (23), గుమ్మడి హర్ష( 25) సీతపల్లి వాగు వద్దకు వచ్చారు. వీరు సరదాగా వాగులోకి స్నానానికి దిగారు. వాగు ప్రవాహ వేగం పెరగడంతో కాలుజారి కొట్టుకుపోయారు. ఈ క్రమంలో వారు వాగులోని రాళ్లకు బలంగా ఢీకొని మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలావుండగా వీరిలో రాకేష్ చిన్న కిళ్లీ దుకాణం నిర్వహిస్తున్నాడు. వాలీబాల్ క్రీడాకారుడైన అతడు మైదానంలో కట్ కొడితే ప్రత్యర్థి జట్టు సభ్యులు అడ్డుకోలేరని మంచి పేరుంది. కాగా గుమ్మడి హర్ష తల్లి కవిత సహకారంతో చిరు వ్యాపారం చేస్తున్నట్టు బంధువులు తెలిపారు.
స్నానం చేస్తుండగా ప్రమాదం
మృతులు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండల వాసులు

సీతపల్లి వాగులో మునిగి ఇద్దరి మృతి

సీతపల్లి వాగులో మునిగి ఇద్దరి మృతి