
నిర్వాసితుల అభీష్టం మేరకే పునరావాసం
చింతూరు: నిర్వాసితుల అభీష్టం మేరకు వారు కోరుకున్న ప్రాంతంలోనే పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడతామని ఆర్అండ్ఆర్ అధికారి, ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన చింతూరుకు చెందిన పోలవరం పీడీఎఫ్ కమిటీ సభ్యులు, గిరిజనేతర నిర్వాసితులతో మాట్లాడారు. తమకు తాడువాయి, సూదికొండ ప్రాంతాలను చూపించారని, తిరువూరు, కృష్ణునిపాలెం ప్రాంతాల్లో స్థలాలను కూడా చూపించాలని నిర్వాసితులు పీవోను కోరారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ తిరువూరు, కృష్ణునిపాలెం ప్రాంతంలో భూముల పరిశీలనకు కొంత సమయం పడుతుందన్నారు. తాడువాయిలో గతంలో చూసిన భూములు కాకుండా వేరే ప్రాంతంలో భూములు కాలనీల నిర్మాణాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ స్థలాన్ని పరిశీలించేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని, స్థలం నచ్చితే కాలనీల నిర్మాణానికి తమ సమ్మతి తెలియజేస్తామని నిర్వాసితులు పీవోను కోరారు. గురువారం బస్సు ఏర్పాటుచేసి నిర్వాసితులను తాడువాయిలోని స్థల సందర్శనకు తీసుకువెళ్లాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.
ఐటీడీఏ పీవో అపూర్వభరత్