
అంగన్వాడీ సరకులు పట్టివేత
పాలిటెక్నిక్ కళాశాలప్రిన్సిపాళ్ల బదిలీ
మురళీనగర్ (విశాఖ): రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు బదిలీలు నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ జీవీ రామచంద్రరావు గన్నవరం పాలిటెక్నిక్ కాలేజీకి బదిలీపై వెళ్లగా, ఆ స్థానంలో సింహాద్రిపురం పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ కె.తాతాజీని బదిలీ చేశారు. ప్రస్తుతం కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు అతని ఒరిజినల్ స్థానం ఆముదాలవలస నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి, ఆముదాలవలసకు శ్రీకాకుళం ప్రిన్సిపాల్ డాక్టర్ బి.జానకిరామయ్య బదిలీపై రానున్నారు. పాడేరు జీఎంఆర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ కె.సుజాత కాకినాడ ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కాలేజీకి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో తాడిపత్రి నుంచి ఎం.హరిబాబు బదిలీపై రానున్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో..
మహారాణిపేట(విశాఖ): వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో భాగంగా ఆంధ్రా మెడికల్ కాలేజీ, కేజీహెచ్లో మొత్తం 43 మందిని బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్, డీసీఎస్ఆర్ఎంవో డాక్టర్ మెహర్కుమార్లు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ లోకనాథం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ అయ్యారు. 12 మంది ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 28 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కూడా స్థాన చలనం కలిగింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 330 మందిని బదిలీ చేశారు. ఈ మేరకు ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాధాకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 250 మంది స్టాఫ్ నర్సులు, 80 మంది హెడ్ నర్సులు బదిలీ అయ్యారు. వైద్య ఆరోగ్యశాఖలో ఐదు కేడర్లలో 60 మంది స్థాన చలనం పొందారు.
అడ్డతీగల: మండలంలోని తిమ్మాపురం–2 అంగన్వాడీ కేంద్రం నుంచి తరలిపోతున్న నిత్యావసర సరకులను స్థానికులు నాలుగురోజుల క్రితం పట్టుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్ నుంచి తరలిపోతున్న నిత్యావసరాలను పట్టుకున్న స్థానికులు గ్రామపెద్దలకు తెలియజేసి, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు సూపర్వైజర్ అరుణలత సిబ్బందితో కలసి వెళ్లి స్థానికులు పట్టుకున్న అంగన్వాడీ సరకులను పరిశీలించారు. వీటిలో 70 కిలోల బియ్యం, 11 కిలోల కందిపప్పు, 60 కోడిగుడ్లు, రెండు వంట నూనె ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. పట్టుకున్న సరకులను గ్రామపంచాయతీ ఆధీనంలో ఉంచారని, తరలింపునకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోలేదని తిమ్మాపురం వాసుల ఆవేదన