
గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం డుడుమ నుంచి నీటి విడుదల
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతమైన డుడుమ జలపాతంలో కోల్కతా వాసి అనిమెస్దాస్ (27) గల్లంతై నాలుగు రోజులు గడుస్తున్నా నేటికీ ఆ యువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఓడిఆర్ఎఫ్ బృందాలు గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మంగళవారం మాచ్ఖండ్ ప్రాజెక్టు అధికారుల ఆదేశాల మేరకు డుడుమ జలాశయం రెండు గేట్లు ఎత్తి గంటకు రెండు వేల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. నీటి ప్రవాహం పెరగడం వల్ల సొరంగంలోంచి బయటకు వచ్చే అవకాశం ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అనిమెస్దాస్ గల్లంతైన దగ్గర నుంచి ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు డుడుమ జలపాతం వద్ద నిరీక్షిస్తున్నారు.
అక్రమ కట్టడాల కూల్చివేతలో అధికారుల నిర్లక్ష్యం
● జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు
చింతూరు: అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలన్న న్యాయస్థానాల ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. 1/70 చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనేతరులు విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, జిల్లాలో కొంతమేర ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ చేపట్టినా ఇతర ప్రాంతాల్లో తొలగింపు ప్రక్రియ ప్రారంభించలేదని ఆయన తెలిపారు. చట్టాలకు విరుద్ధంగా వలస గిరిజనేతరులకు ఏజెన్సీలో ఎన్వోసీలు, ధ్రువపత్రాలు జారీచేయడం వల్ల ఆదివాసీలు తమ భూములను కోల్పోతున్నారని ఆయన తెలిపారు. చింతూరు డివిజన్లో అధికారులు కొందరు వ్యక్తుల చెప్పుచేతల్లో నడుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలన్నింటినీ జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు శ్రీను తెలిపారు.