
అసనగిరి వాసులకు మళ్లీ అస్వస్థత
నాతవరం: కలుషిత ఆహారం ఘటనలో మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం నాతవరం పీహెచ్సీలో వైద్య సేవలు అందించారు. నాతవరం మండలం సుందరకోట పంచాయతీ శివారు అసనగిరి గ్రామానికి చెందిన 12 మంది, కాకినాడ జిల్లా రవతలపూడి మండలం రాఘవట్నం చెందిన 16 మంది కుటుంబ సభ్యులు కలిసి ఈ నెల 14న రాత్రి పాడేరు మోదకొండమ్మ దర్శనానికి వెళ్లారు. అక్కడ పులిహోర తిని మార్గమధ్యంలో పలు చోట్ల మంచినీరు తాగారు. ఈ నెల15న పాడేరులో అస్వస్థతకు గురవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సా అందించారు. ఆరోగ్యం కుదుటపడటంతో అదే రోజు రాత్రికి స్వగ్రామాలకు వచ్చేశారు. అసనగిరిలో వీరికి మరలా అస్వస్థత కావడంతో సోమవారం మధ్యాహ్నం ఆటోల్లో నాతవరం పీహెచ్సీకి తీసుకొచ్చారు. అక్కడ వైద్యాధికారులు ప్రసన్న, ఎం.రాజేష్నాయుడు వైద్య సేవలు అందించారు. వీరిలో బూటారి దుర్గా సాయిని మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లారు. మిగతా వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా వారు నిరాకరించారు. వైద్యాధికారి వెంటనే తహసీల్దార్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ ఎ. వేణుగోపాల్, వైద్యాధికారి రాజేష్నాయుడు గిరిజనులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వారు అంగీకరించలేదు. దాంతో పోలీసులు బందోబస్తుతో రెండు అంబులైన్సులో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రిలో అసనగిరి గ్రామానికి చెందిన పాండవుల గంగాభవాని, వెలగల వరలక్ష్మి, వెంకట్, కాసుబాబు, బూటారి ములసమ్మ, వెలగల వెంకయ్యమ్మ, రాజు, చల్లా లక్ష్మి, చల్లా ప్రసాద్, బూటారి అనిల్, బూటారి లక్ష్మి చికిత్స పొందుతున్నారని వైద్యాధికారులు తెలిపారు.
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరణ
నాతవరం పీహెచ్సీ నుంచి పోలీసు బందోబస్తుతో తరలింపు