విద్యాలయాలా.. వ్యాపార కేంద్రాలా?
గుర్తింపు రద్దు చేయాలి
నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లోనే అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి. పుస్తక వ్యాపారాన్ని విద్యాశాఖ అధికారులు ఎందుకు కట్టడి చేయడం లేదో వారికే తెలియాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో పుస్తకాలు, అధిక ఫీజుల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ స్పందన లేదు.
–మైలపల్లి బాలాజీ,
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు
చర్యలు తీసుకోవాలి
జిల్లాలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల నిర్వాహకులు పలు రకాల ఫీజులతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారు. ప్రతి ఏటా ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించడంలేదు. ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో డిస్ ప్లే చేయడం లేదు. సామగ్రి కొనక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే తనిఖీలు చేసి నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.
–బి.బాబ్జీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు
● ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో అంతులేని దోపిడీ
● అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫాం, సామగ్రి విక్రయాలు
● తడిసి మోపెడవుతున్న ఖర్చులు
● చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న
అధికారులు
యలమంచిలి రూరల్:
జిల్లాలో 500కు పైగా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్లు మినహాయిస్తే మిగతా అన్ని విద్యా సంస్థల్లో విద్యా వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఒకవైపు అధిక ఫీజులతో సతమతమవుతున్న మధ్యతరగతి వర్గాల వారు ఈ ఏడాది భారీగా పెంచిన పుస్తకాల ధరలతో షాకవుతున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు సొంత సిలబస్ పేరుతో పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నాయి. ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల ధరలు వందల్లో ఉంటే, ప్రైవేటు విద్యాసంస్థలు ముద్రించిన పుస్తకాల ధరలు వేలల్లో ఉంటున్నాయి. జిల్లాలో అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, అచ్యుతాపురం, పాయకరావుపేట, నర్సీపట్నం సహా మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో నిర్వహిస్తున్న పలు ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, ఇతర సామగ్రి అమ్ముతున్న నిర్వాహకులు 1 నుంచి 5 తరగతి వరకు పుస్తకాలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. 6 నుంచి 10 తరగతులకు రూ.7,500 నుంచి రూ.10,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక ఇంటర్మీడియట్కైతే ఈ దోపిడీ మ రింత ఎక్కువగా ఉంటోంది. నీట్, ఐఐటీ, ఐఏఎస్, ఒలింపియాడ్, సీ బ్యాచ్, ఎం బ్యాచ్, టెక్నో వంటి పేర్లతో అదనంగా వసూలు చేస్తున్నారు. బడి బస్సు ల ధరలనూ అడ్డగోలుగా పెంచేస్తున్నారని.. మరో గ త్యంతరం లేక వారు అడిగినంత చెల్లించాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ మార్కెట్ తరహాలో..
జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో పేరొందిన ఐదు యాజమాన్యాలకు చెందిన కార్పొరేట్ విద్యాసంస్థల బ్రాంచీలన్నీ సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రితో స్టోర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని వస్తువులూ తమ వద్దే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేయడంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు వారికి వేలాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రెండ్రోజుల క్రితం భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) నాయకులు యలమంచిలి కోర్టు పేటలో ఉన్న ఒక కార్పొరేట్ విద్యాసంస్థలోకి వెళ్లి అక్కడ బుక్ స్టోర్ను పరిశీలించారు. ఇది స్కూలా.. పుస్తకాల దుకాణమా అని నిలదీయడంతో అక్కడ మహిళా సిబ్బంది సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అనకాపల్లి రెవెన్యూ కార్యాలయం ఎదురు వీధిలో ఉన్న ఒక కార్పొరేట్ కాలేజీ ఎదుట శనివారం ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. పుస్తకాలు విక్రయాలను అడ్డుకోవాలని, విద్యాసంస్థ దోపిడీని అరికట్టాలని నినాదాలు చేస్తూ విద్యాసంస్థ నేమ్ బోర్డులను ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు.
విద్యాలయాలా.. వ్యాపార కేంద్రాలా?
విద్యాలయాలా.. వ్యాపార కేంద్రాలా?
విద్యాలయాలా.. వ్యాపార కేంద్రాలా?


