
గిరిజన సాధికారతే లక్ష్యం
ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం
గంగవరం : జనభగిదరి అభియాన్ లక్ష్యం గిరిజన సాధికారత లక్ష్యమని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. కుసుమరాయి గ్రామంలో జరిగిన ధర్తి భగిధరి అభియాన్ కార్యక్రమం అవగాహన సదస్సులో ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా 150 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గిరిజన సంక్షేమశాఖ మిషన్ లక్ష్యాలను పీఓ వివరించారు. గిరిజన గ్రామాలకు రహదారులు, గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలు, గృహ సముదాయాలు, విద్యా, వైద్య సదుపాయాలు వంటి మౌలిక సౌకర్యాలు కార్యచరణ చేయడం జరుగుతుందన్నారు. ఏజెన్సీలోని గిరిజన మారుమూల గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ధర్తి ఆబ జన భగిదరి అభియాన్ ద్వారా గిరిజనులకు అవగాహన కల్పించినట్టు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం తెలిపారు. రంపచోడవరం డివిజన్లో 211 గ్రామాలు ముందుగా గుర్తించడం జరిగిందని అడ్డతీగల మండలంలో 7 గ్రామాలు, దేవిపట్నం మండలంలో 11 గ్రామాలు, గంగవరం మండలంలో 47 గ్రామాలు, మారేడుమిల్లి మండలంలో 40 గ్రామాలు, రాజమ్మంగి మండలంలో 14 గ్రామాలు, రంపచోడవరం మండలంలో 23 గ్రామాలు, వైరామవరం మండలంలో 67 గ్రామాలు మౌలిక సదుపాయాలు కల్పనకు ముందుగా గుర్తించినట్టు ఆయన తెలిపారు. అలాగే సబ్ ప్లాన్ ఏరియాలో రౌతులపూడి మండలంలో ఒక గ్రామం, శంఖవరం మండలంలో మూడు గ్రామాలు, ప్రత్తిపాడు మండలంలోని రెండు గ్రామాలు గుర్తించడం జరిగిందన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో, సిబ్బందితో కమిటీలు వేయడం జరిగిందని ఈ కమిటీలు గుర్తించిన గ్రామాల్లో వివిధ గిరిజన తెగలకు అవగాహన సదస్సుల ద్వారా అవగాహన కల్పించినట్టు చెప్పారు. ఈనెల 15వ తారీకు నుండి ఈనెల 30వ తారీకు వరకు అవగాహన సదస్సులలో అర్హులైన లబ్ధిదారులకు ఆధార్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, పీఎం ఆవాస్ యోజన పథకంలో పక్కా గృహాలు, పాఠశాలల నిర్మాణాలు, ఏకలవ్య మోడల్ పాఠశాలల నిర్మాణాలు, వైద్య ఆరోగ్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని పీఓ అన్నారు. ఆముదాలబంద సర్పంచ్ పాయం రాజులమ్మ, ఎంపీడీవో వై.లక్ష్మణరావు, ఉపాధి ఏపీఓ ప్రకాశ్, డిప్యూటీ ఎంపీడీవో నరసింగరావు, వెలుగు ఏపీఎం షణ్ముఖరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.