
హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు
అరకులోయటౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి సీఎం చంద్రబాబునాయు డు ప్రజలను వంచించారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో ముద్రించిన పుస్తకాన్ని సోమవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో పనిచేశారన్నారు. ఇచ్చిన హామీలకు మించి మేలు చేశారని చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని ఊదరగొట్టి, తరువాత విస్మరించారన్నారు. 87 లక్షల మందికి రూ.15వేల చొప్పున తల్లికి వందనం పథకం నిధులు మంజూరు చేయవలసి ఉండగా భారీగా కోత విధించారని చెప్పారు. పథకం అమలులో అవకతవకలు జరిగాయన్నారు.37 పేర్ల తో ఒక తల్లి ఖాతాలో, 17పేర్లతో మరో తల్లి ఖాతా లో సొమ్ము జమచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యూత్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ మండలాల అధ్యక్షులు స్వాభి రామూర్తి, కొర్రా సూర్యనారాయణ, అరకు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ, సర్పంచ్ గుమ్మ నాగేశ్వరరావు, నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, పార్టీ మండలాల ఉపాధ్యక్షులు జి.ప్రకాష్, గణపతి, జిల్లా మేధావి విభాగం అధ్యక్షుడు కిల్లో రాజరమేష్, నాయకులు బాక సింహాచలం, శెట్టి మోహన్రావు, ఎస్.నందీశ్వరరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం