
బాగుకోసం..
హుకుంపేట మండలం శోభకోట పంచాయతీ ఈదులగొంది మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు ఎల్లేటి శ్రీనివాసరావు సాటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన పనిచేస్తున్న పాఠశాలకు పక్కా భవనం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన సమస్య పరిష్కారానికి సంకల్పించారు. ఆయన సొంత నిధులతో పాటు స్నేహితుల సహకారంతో రూ.లక్ష సమకూర్చారు. ఈ నిధులకు గ్రామస్తుల శ్రమదానం జోడించి పాఠశాలకు సొంత భవనం సమకూర్చారు.
ఓ ఉపాధ్యాయుడి తపన
హుకుంపేట: పాఠశాలకు వసతి సమస్య పరిష్కరించేందుకు ఓ ఉపాధ్యాయుడు సొంత నిధులు వెచ్చించారు. దీనికి గ్రామస్తులు శ్రమదానం జోడించి భవన నిర్మాణాన్ని పూర్తిచేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వసతి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించుకున్నారు. మండలంలోని శోభకోట పంచాయతీ ఈదులగొంది చిన్న గ్రామం. ఇక్కడ పీవీటీజీ సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు జీవిస్తున్నారు. ఇక్కడి పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. పక్కా భవనం లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు పలుసార్లు ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేకపోయింది. గ్రామస్తులంతా శ్రమదానంతో మట్టిగోడలు నిర్మించి రేకులతో షెడ్డు ఏర్పాటుచేసుకుని తాత్కాలికంగా వసతి సమస్య కల్పించారు. ఈ నేపథ్యంలో ఇదే పాఠశాలకు రెండేళ్ల క్రితం వచ్చిన ఉపాధ్యాయుడు ఎల్లేటి శ్రీనివాసరావు విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతి సమస్యను గుర్తించారు. సమస్య పరిష్కరించేందుకు ఆయన సంకల్పించారు. ఇందుకు ఆయన స్నేహితులైన ఉపాధ్యాయుడు రాజేంద్ర తదితరులు ఆర్థిక సహకారం అందించారు. మొత్తంమీద భవన నిర్మాణానికి ఉపాధ్యాయుడు రూ.లక్ష వరకు నిధులు సమకూర్చారు. దీనికి గ్రామస్తులు శ్రమదానం జోడించారు. పాఠశాల భవనాన్ని నిర్మించి విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించారు. టైల్స్తో మరుగుదొడ్లు నిర్మించారు.
భవన నిర్మాణానికి సొంత నిధులు స్నేహితుల సహకారంతో రూ.లక్ష సమకూర్చిన టీచర్ శ్రమదానం జోడించిన ఈదులగొంది గిరిజనులు సమష్టి కృషితో సమస్య పరిష్కారం
ప్రభుత్వ భవన నిర్మాణానికి కృషి
గ్రామంలో పాఠశాల భవనం లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. 2014లో భవనం మంజురైనప్పటికీ నిర్మాణం ప్రారంభ దశలోనే ఆగిపోయింది. పక్కా భవన నిర్మాణానికి కృషి చేస్తాం
– సోమేలి చెల్లయ్య,
డిప్యూటీ డీఈవో, పాడేరు